నేను ఏపీ ముఖ్యమంత్రిని అయితే ఏం చేస్తానంటే.. మనసులో మాట చెప్పిన జగన్!

తమకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఏపీని విభజించారనీ, ఈ సందర్భంగా ఇచ్చిన హామీలను సైతం కేంద్ర ప్రభుత్వం అమలుచేయలేదని విమర్శించారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన ‘ఇండియా టుడే కాన్ క్లేవ్-2019’లో జాతీయ రాజకీయాలతో పాటు ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై జగన్ ముచ్చటించారు.

ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ రాహుల్ కన్వల్ ‘మీరు ఏపీ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు? వైఎస్సార్‌ సంక్షేమ రాజ్యానికి, మీ పరిపాలనకు తేడా ఎలా ఉంటుంది?’ అని ప్రశ్నించారు. దీనికి జగన్ జవాబిస్తూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ వర్గం వారికి మాత్రమే ప్రయోజనం కల్పించారని విమర్శించారు. ఆయన పాలనలో ఎన్నో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. తమకు ఓటేసిన వారికే ప్రభుత్వ పథకాలు అంటూ ఏపీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కానీ వైసీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. తాము ప్రకటించిన ‘నవరత్నాల’ పథకంతో రాష్ట్రంలోని ప్రతీఒక్కరికీ లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతీగ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా చిట్టచివరి లబ్ధిదారుడికి కూడా సంక్షేమ ఫలాలు అందిస్తామని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
Jagan
Telugudesam
Chandrababu
indiatoday conclave

More Telugu News